ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేషనల్ హైవేపై ఏఐ సిస్టమ్.. ట్రాఫిక్ ఉల్లంఘిస్తే వెంటనే చలాన్

national |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 09:18 PM

దేశంలో జాతీయ రహదారులు రోజురోజుకూ అత్యాధునికంగా మారిపోతున్నాయి. దీంతో నేషనల్ హైవేలపై వాహనాలు రయ్యిమంటూ దూసుకెళ్తున్నాయి. సుదూర ప్రాంతాలకు రోడ్లు విస్తరించడమమే కాకుండా.. విశాలంగా నిర్మిస్తున్నారు. అదే సమయంలో.. భవిష్యత్‌లో నేషనల్ హైవేలు మరింత స్మార్ట్‌గా మారిపోనున్నాయి. తాజాగా ఢిల్లీ-గురుగ్రామ్‌ను కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే అత్యాధునిక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది సక్సెస్ అయితే.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నేషనల్ హైవేలపై అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఇక ఈ ఢిల్లీ గురుగ్రామ్‌ ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ హైవేగా మారిపోయింది.


నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా-ఎన్‌హెచ్ఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను రూపొందించారు. ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ ఈ కొత్త సిస్టమ్‌ను అభివృద్ధి చేయగా.. దాని అమలు బాధ్యతలను ఎన్‌హెచ్‌ఏఐ పర్యవేక్షిస్తోంది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ హైవేతో పాటు.. ఎన్‌హెచ్‌-48పై 28 కిలోమీటర్ల మేర అత్యాధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొత్తంగా 56.46 కిలోమీటర్ల మేర రహదారిపై ఈ ఏఐ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగిన డిజిటల్ హైవేగా ఈ ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేగా గుర్తింపు పొందింది. ట్రాఫిక్ మానిటరింగ్, ప్రమాదాల గుర్తింపు కోసం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం.


ఇక ఈ ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేపై సీటు బెల్టు ధరించకుండా ప్రయాణిస్తే అత్యాధునిక కెమెరాలు క్లిక్ మని ఫోటోలు కొట్టేస్తాయి. ట్రిపుల్ రైడింగ్, స్పీడ్ డ్రైవింగ్ వంటి 14 రకాల ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. ఈ ఏఐ సిస్టమ్ గుర్తిస్తుంది. ఈ అత్యాధునిక ఏఐ సిస్టమ్‌కు ఎన్‌ఐసీ ఈ-చలాన్ పోర్టల్ కూడా అనుసంధానం చేసి ఉంచారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అందిస్తుంది.


ఇప్పటికే రోడ్డు భద్రతపై ఎన్‌హెచ్‌ఏఐ ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. ఈ ఏఐ సిస్టమ్ ద్వారా రోడ్డు వినియోగం, రహదారి భద్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ రహదారిపై ఒక్కో కిలోమీటర్‌కు ఒకటి చొప్పున మొత్తం 110 హై రిజల్యూషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలు రహదారిపై పూర్తి నిఘాను పెట్టి ఉంచుతాయి. ఈ ఏఐ వ్యవస్థ 5 రకాల వ్యవస్థలను కలిగి ఉంటుంది. ట్రాఫిక్ మానిటరింగ్, యాక్సిడెంట్ వీడియోలు రికార్డ్ చేయడం, వెహికల్ స్పీడ్‌ను కంట్రోల్ చేయడం, సైన్ బోర్డులు, సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఉంటాయి.


ఈ 5 సిస్టమ్‌లలో కమాండ్ సెంటర్ అనేది డిజిటల్ బ్రెయిన్‌గా ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే స్థానిక, నేషనల్ హైవే సిబ్బందికి సమాచారం అందిస్తుంది. దట్టమైన పొగమంచు ఏర్పడడం, రహదారిపై అడ్డంకులు ఏర్పడినపుడు, హైవేపైకి జంతువులు వచ్చినపుడు సంబంధిత సిబ్బందిని అలర్ట్ చేస్తుంది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై అమలు చేసిన ఈ ఆటోమేటెడ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అదే జరిగితే మన జాతీయ రహదారులు మరింత ఆధునికతను సంతరించుకోనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa