ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తగా మరో రూల్..గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 07:47 PM

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్య గమనిక. సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విధివిధానాలు జారీ చేసింది. 2025 మే 31 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం విధివిధానాలలో నిర్దేశించింది. ఐదేళ్లు పూర్తి కానివారు వ్యక్తిగతంగా బదిలీ చేయాలని కోరితే.. వారి అభ్యర్థన మేరకే బదిలీలు చేయాలని స్పష్టం చేసింది. అలాగే ఏ ఉద్యోగికి కూడా తన సొంత మండలం, గ్రామంలో పోస్టింగ్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. భార్యాభర్తలు ఇద్దరూ సచివాలయ ఉద్యోగులు అయితే.. వారికి ఒకే ప్రాంతంలో పోస్టింగ్‌ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియను జూన్ 30లోపు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.


మరోవైపు 2019, అక్టోబరు 2న వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ అమల్లోకి తెచ్చారు. ప్రజలకు సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సొంతూరులో పనిచేయకూడదని అప్పటి ప్రభుత్వం నిబంధన తెచ్చింది. ఇప్పటి టీడీపీ ప్రభుత్వం..సొంత మండలంలో కూడా పోస్టింగ్ ఇవ్వొద్దని రూల్ తెచ్చింది. దీంతో పొరుగున ఉన్న మండలాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.


మరోవైపు 2024 సెప్టెంబరులో ఏపీ ప్రభుత్వం సాధారణ బదిలీలు చేపట్టింది. అయితే ఆ సమయానికి గ్రామ, వార్డ సచివాలయ ఉద్యోగుల పదవీ కాలం అయిదేళ్లు పూర్తికాలేదు. దీంతో కౌన్సెలింగ్‌ ద్వారా 20 శాతం మందిని చేశారు. తాజాగా దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీలు చేయనున్నారు. దీంతో 80 శాతానికిపైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీ కానున్నారు.


మరోవైపు పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాలను క్లస్టర్లుగా విభజిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇటు సచివాలయాల ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అటు బదిలీలు ఒకేసారి జరుగునున్నాయి. గతంలో ఒక సచివాలయంలో 8 నుంచి 11 మంది ఉద్యోగులు ఉండగా.. తాజా మార్గదర్శకాలతో ‘ఏ’ కేటగిరి సచివాలయాల్లో ఆరుమంది. బీ కేటగిరీ సచివాలయాల్లో ఏడుమంది, సీ కేటగిరీ సచివాలయాల్లో 8 మంది ఉద్యోగులు ఉంటారు. మిగతా ఉద్యోగులను ఇతర శాఖలలో సర్దుబాటు చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa