భారత్- పాకిస్థాన్తో ఉద్రిక్తతల మధ్య బీసీసీఐ ఐపీఎల్ 2025ని వారం పాటు వాయిదా వేసింది. టోర్నీలోని మ్యాచ్లకు వేదికల్లో కొన్నిచోట్ల పరిస్థితులు ప్రశాంతంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం వారం పాటు ఐపీఎల్ను వాయిదా వేసిన బీసీసీఐ.. తదుపరి కార్యచరణపై ఫోకస్ పెట్టింది. లీగ్లో 12 లీగ్ దశ మ్యాచ్లతో పాటు 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఉన్నాయి. మొత్తంగా 16 మ్యాచ్లు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీటిని ఎక్కడ? ఎప్పుడు? నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. తాజాగా భారత్- పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గితే.. భారత్లోనే ఈ మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందట. అయితే తొలుత ప్రకటించిన షెడ్యూల్లో ఉన్న వేదికల్లో కాకుండా.. పరిమిత సంఖ్యలో వేదికలపైనా ఈ మ్యాచ్లు జరగనున్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ ముఖ్యంగా ఇటీవల తన డ్రోన్లతో ఉత్తరాధి రాష్ట్రాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో టోర్నీని కంప్లీట్ చేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం మూడు వేదికలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వేదికల్లో మిగతా 16 ఐపీఎల్ 2025 మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం అనుమతిస్తే.. వారం తర్వాత ఈ మూడు వేదికల్లోనే టోర్నీని ఫినిష్ చేయాలని ప్రణాళికతో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.
మరోవైపు టోర్నీ వారం తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు తక్కువే ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది విదేశీ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది వారి దేశాలకు వెళ్లిపోయారు! వారు మళ్లీ ఆడేందుకు వస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. అదే జరిగితే ఐపీఎల్ మరికొన్ని నెలల పాటు వాయిదా పడొచ్చని తెలుస్తోంది.
ఒకవేళ ఈ నెలలో టోర్నీ నిర్వహించడం సాధ్యం కాకపోతే.. సెప్టెంబర్లో మళ్లీ నిర్వహించే అవకాశం ఉంది. అలాకాకుండా ఇంగ్లాండ్, యూఏఈ లాంటి దేశాల్లో టోర్నీని నిర్వహించాలని ఐపీఎల్ భావిస్తే.. వారం తర్వాత టోర్నీ ప్రారంభం కావొచ్చు. అధికారిక ప్రకటన వచ్చాకే.. దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది.
![]() |
![]() |