ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొంపముంచిన వెకేషన్ టూర్.. వైద్యానికి కోటి రూపాయల ఖర్చు

international |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 09:23 PM

టిక్‌టాక్ వీడియో ఈ బ్రిటన్ దంపతుల కొంపముంచింది. ప్రాణం మీదకు తీసుకురావడమే కాక.. ఏకంగా కోటి రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకు ఏం జరిగిందంటే.. టిక్‌టాక్‌లో చూసిన ఓ జలపాతం దగ్గరికి వెకెషన్ కోసం వెళ్లారు ఓ బ్రిటీష్ జంట. అయితే వారి కలల విహారయాత్ర కాస్త.. అంతులేని విషాదాన్ని.. భారీ నష్టాన్ని మిగిల్చింది. 30 అడుగుల పై నుంచి పడిపోయి.. తీవ్ర గాయాలపాలయ్యి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బ్రిటన్ వ్యక్తి. ఆస్పత్రి బిల్లు కోటి రూపాయలకు పైగా అయ్యింది. ఆ వివరాలు..


బ్రిటీష్ సైనికుడు 23 ఏళ్ల లియామ్ తన భార్య లూసీతో కలిసి థాయిలాండ్‌లోని ఓ జలపాతం చూడటం కోసం వెళ్లాడు. ఓ టిక్‌టాక్ వీడియోలో లియామ్ దంపతులు ఆ జలపాతాన్నిచూశారు. బాగా ఆకర్షించడంతో.. వెకేషన్ కోసం అక్కడకు వెళ్లారు. అయితే ఎంజాయ్ చేద్దామని వెళ్లిన వారిని దురదృష్టం పలకరించింది. జలపాతం అందాలు చూడటానికి వెళ్లిన లియామ్.. 30 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడ్డాడు. ఈ ప్రమాదంలో లియామ్‌కు తలకు తీవ్ర గాయమైందని.. అలానే కాలు విరిగిపోయిందని ది మెట్రో తెలిపింది.


లియామ్ పడిపోవడం గమనించిన అతడి భార్య లూసి.. వెంటనే అప్రమత్తం అయ్యి.. అతడిని మరింత కిందకు పడిపోకుండా పట్టుకుంది. లేదంటే లియామ్ 100 అడుగుల కిందకు పడిపోయేవాడని ది మెట్రో తెలిపింది. ఈ జంట ఇప్పుడు వైద్య ఖర్చుల నిమిత్తం 100,000 పౌండ్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 1.13 కోట్లు) ఖర్చు చేయాల్సి వచ్చింది. అంతేకాక మెరుగైన వైద్యం కోసం యూకేకి తరలించాలని వైద్యులు వెల్లడించారు.


లూసి మాట్లాడుతూ.. జలపాతం దగ్గర చాలా కుటుంబాలు ఉన్నాయి. లియామ్ ఫొటోలు తీసుకుంటూ అక్కడే ఉన్నాడు.కాసేపటి తర్వాత నా భర్త నాకు కనిపించలేదు. అతడిని పిలుచుకుంటూ ముందుకు వెళ్లాను.చివరకు ఓ రాయి చివరన రక్తపు మడుగులో ఉన్న లియామ్ నాకు కనిపించాడు. వెంటనే నేను కిందకు పరిగెత్తుకు వెళ్లాను. అతడు మరింత కిందకు పడకుండా చూడటం కోసం రక్తపు మడుగులోనే కూర్చుని.. అతడి చుట్టూ కాళ్లుచేతులు వేసి పడిపోకుండా పట్టుకున్నాను. సాయం కోసం కేకలు వేశాను. చివరకు ఒ క థాయి యువకుడు వచ్చి మాకు సాయం చేశాడు.


కింద పడటంతో అతడి కాలు విరిగి ఎముక బయటకు వచ్చింది. మరీ అతడి పుర్రెని చూస్తే భయంతో దడుచుకుంటారు. అంత తీవ్రంగా గాయపడ్డాడు అని చెప్పుకొచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు లియామ్ కాలువిరిగిందని, పుర్రెకి బాగా దెబ్బలుతగిలాయని.. ముఖానికి కూడా తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.


ఆస్పత్రి బిల్లు చెల్లిస్తే తప్ప ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేయరు. మా దగ్గర అంత మొత్తం లేదు. అందుకే క్రౌడ్ ఫండింగ్ కోసం వెళ్లాలని అనుకుంటున్నాము అని చెప్పుకొచ్చింది లూసి. దయచేసి మాకు సాయం చేయండి అని కోరతుంది. ఇక ఆ జలపాతం దగ్గర ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే ప్రథమం కాదట. గతంలో అనగా 2019లో ఇద్దరు టూరిస్టులు కూడా ఇలానే కిందపడి చనిపోయారు. ప్రమాద హెచ్చరికలు ఉన్నప్పటికి కూడా జనాలు ఇక్కడకు తండోపతండాలుగా వస్తున్నారు.


అయితే ఈ జలపాతాన్ని సందర్శించడానికి వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల కోసం థాయిల్యాండ్ ప్రభుత్వం ఉచిత బీమా పథకం తీసుకువచ్చింది. 12 లక్షల వరకు ప్రమాద బీమ కల్పిస్తుంది. అయితే చాలా మంది పర్యాటకులకుఈ బీమా సౌకర్యం గురించి తెలియదు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com