ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఇంగ్లాండ్ ప్లేయర్ జోస్ బట్లర్ ఐపీఎల్ 2025తో కొత్త జట్టుకు మారిపోయాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ బట్లర్ను రిలీజ్ చేసింది. దీంతో అతడు వేలంలోకి రావాల్సి వచ్చింది. అయితే, ఇతర జట్లతో పోటీ పడి మరీ గుజరాత్ టైటాన్స్ జోస్ బట్లర్ను దక్కించుకుంది. ఏకంగా రూ. 15.75 కోట్లు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది.
గుజరాత్ టైటాన్స్ అంచనాలను అందుకుంటూ బట్లర్ రాణిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన బట్లర్.. 81.20 సగటుతో 406 రన్స్ స్కోరు చేశాడు. అందులో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. సుమారు 170కి పైగా స్ట్రైక్రేట్తో పరుగులు సాధిస్తున్న ఈ ప్లేయర్.. తాను ఎందుకుంత విలువైన ఆటగాడిని మరోసారి రుజువు చేస్తున్నాడు.
ఐపీఎల్ 2025లో 54 (33), 39 (24), 73* (39), 0 (3), 36 (25), 16 (14), 97* (54), 41* (23), 50* (26) పరుగులు చేశాడు బట్లర్. ప్రస్తుతం ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్ రేసులో బట్లర్ నాలుగో ప్లేసులో ఉన్నాడు. తాజాగా తన మాజీ జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లోనూ జోస్ బట్లర్ అదరగొట్టాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చి.. 26 బంతుల్లోనే 50 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. తన ఇన్నింగ్స్ను రాజస్థాన్ రాయల్స్ను ఫీల్ అయ్యేలా చేశాడు ఈ ప్లేయర్. అరెరే అనవసరంగా వదిలేశామే అనుకునేంతలా తన ప్రతాపం చూపించాడు బట్లర్. బట్లర్తో పాటు శుభ్మన్ గిల్ (50 బంతుల్లో 84 రన్స్), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39 రన్స్) కూడా రాణించడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 రన్స్ స్కోరు చేసింది. రాజస్థాన్ రాయల్స్ ముందు 210 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
![]() |
![]() |