బెంగళూరు:భారత్-జపాన్ పర్యటన కార్యక్రమంలో భాగంగా జపాన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందం బెంగళూరులోని ప్రముఖ సాంకేతిక, రక్షణ, పరిశోధనా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లను సందర్శించింది.
జపాన్ మాజీ విదేశాంగ, రక్షణ మంత్రి టారో కోనో నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందంలో చట్టసభ సభ్యులు కరెన్ మకిషిమా, కెన్జీ నకానిషి, సాకో యమమోటో సభ్యులుగా ఉన్నారు. సెప్టెంబర్ 19న ఈ బృందం బీఈఎల్ బెంగళూరు కాంప్లెక్స్ను సందర్శించిందని సంస్థ వెల్లడించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 'విశిష్ట సందర్శకుల కార్యక్రమం' కింద ఈ పర్యటనను సమన్వయం చేసింది.
ఈ పర్యటనలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అంతరిక్షం, రక్షణ మరియు స్టార్టప్ల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలపై ప్రధానంగా దృష్టి సారించారు. భారతదేశంలోని తాజా సాంకేతిక పరిణామాలపై జపాన్ ప్రతినిధులకు అవగాహన కల్పించడం, క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా చూపించడం, సంబంధిత భాగస్వాములతో ముఖాముఖి చర్చలను సులభతరం చేయడమే ఈ పర్యటన ముఖ్య లక్ష్యమని జపాన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఇటీవల జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి భారత్లో పర్యటించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత చేకూరింది. స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫి ప్రాంత సాధనకు మరియు ప్రాంతీయ భద్రత, సముద్ర భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశాయి. ఈ సందర్శన ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక, సముద్ర సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రతినిధులు పేర్కొన్నారు.