ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్
శాన్ ఫ్రాన్సిస్కో:కృత్రిమ మేధ (AI) కారణంగా ప్రపంచ వినాశనం సంభవిస్తుందనే ఆందోళనలను ఎన్విడియా (NVIDIA) సీఈఓ జెన్సన్ హువాంగ్ పూర్తిగా తోసిపుచ్చారు. 2030 నాటికి ఏఐ వల్ల ఎలాంటి విపత్తు సంభవించడానికి "సున్నా శాతం అవకాశం" ఉందని ఆయన స్పష్టం చేశారు. సీబీఎస్ న్యూస్ 'సండే మార్నింగ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఏఐ భద్రతపై వస్తున్న వార్తలు అనవసర భయాన్ని పెంచుతున్నాయని అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అభివృద్ధి చేస్తూనే, పూర్తి భద్రతా ప్రమాణాలు పాటించిన తర్వాతే ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, ఏఐ అభివృద్ధి వేగంపై టెక్ పరిశ్రమలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్, గూగుల్ డీప్మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ వంటి ప్రముఖులు ఏఐ వేగవంతమైన పురోగతిపై ఆందోళన వ్యక్తం చేశారు. మానవ నియంత్రణను దాటిపోయే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ముందడుగు వేయాలని వారు కోరుతున్నారు. కాగా, ఏఐ ప్రమాదాలపై వస్తున్న భయాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా "బూటకం" అని కొట్టిపారేయడం గమనార్హం.