Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> State News >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
"మృత్యు"భవనం

buildహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున... నారాయణగూడ ఫ్లైఓవర్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 13 మంది కూలీలు మృత్యు వాత పడ్డారు. ఇందులో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం నిర్మించిన రెండంతస్తుల భవనంపై మరో నాలుగు అంతస్తులను భవన యజమాని అలీముద్దీన్‌ ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం 1.50 నిమిషాల సమయంలో ఒక్కసారిగా కుప్ప కూలడం... ఆ పక్కనే బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌ ఉన్నప్పటికీ, విద్యార్థులకు పాఠశాలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే నాలుగవ అంతస్తుపై అయిదవ అంతస్తు నిర్మాణానికి ఇటుక, ఇసుక, సిమెంట్‌తో పాటు ఐరన్‌రాడ్‌లతో నింపివేయడంతో అధిక బరువుతో ఒక్కసారిగా కుప్పకూలిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఆరుగురు మగ కూలీలు, ఆరుగురు ఆడ కూలీలతో పాటు ఎలక్ట్రీషియన్‌, వాచ్‌మ్యాన్‌ కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తున్నది.

buildingఇందులో బిలాన్‌ అనే వ్యక్తితో పాటు ఒక మహిళను పోలీసులు సజీవంగా పైకితీయగలిగారు. ఏడాదిన్నర చిన్నారి మరణించింది. ప్రధాన రహదారిపై నాలుగంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలడంతో పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పక్కనే బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌ ఉండటంతో విద్యార్థులకు ఏదైనా ముప్పు వాటిల్లిందని ఆందోళన చెందారు. అదృష్టవశాత్తు పాఠశాల భవనానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ, పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ఇంటికి పంపించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే వందల సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకోవడం, ప్రధాన రహదారి కావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. కాంక్రీట్‌తో నిర్మించిన భవనం కావడంతో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని తీసేందుకు నగరపాలక సంస్థ, జేసీబీలు, ఇతరత్రా క్రేన్‌ల సహాయంతో ఎక్కడికక్కడ గోడలను పగులగొట్టి శిథిలాల కింద ఉన్నవారిని వెలికితీశారు.

శరీరాలు తూట్లుపడిపోయి.....పేగులు బయటకు వచ్చిన మృతదేహాలను చూసిన ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సహా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, దత్తాత్రేయ, ముఖేశ్‌గౌడ్‌, ఆనం రాంనారాయణరెడ్డి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి దుర్ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

hmmరూ 2 లక్షల ఎక్స్‌గ్రేషియా: రాంరెడ్డి వెంకట్‌రెడ్డి
నారాయణగూడలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రెండు లక్షల రూపాయల పరిహారం అందజేయనున్నట్లు మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
బాధితులను ఆదుకోండి: చంద్రబాబు: నారాయణగూడలో నాలుగంతస్తుల భవనం కూలిపోయిన సంఘటన తెలుసుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం సంఘటనా స్థలాన్ని సందర్శించారు.



sabhithaయజమాని, బిల్డర్‌పై కఠిన చర్యలు: హోంమంత్రి సబిత
భవనం కూలి దాదాపు 13 మంది మృత్యువాత పడిన ప్రదేశాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. సహాయక చర్యలను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు లేకుండా ఏ విధంగా నిర్మాణాలు చేపట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన యజమాని, బిల్డర్‌పై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నారాయణగూడలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ప్రదేశానికి స్థానిక ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, మంత్రి ముఖేశ్‌గౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమిక్షించారు.

విచారణ కమిటీ : మంత్రి ఆనం
నారాయణగూడలో భవనం కూలిపోయిన దుర్ఘటనపై జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ సమీర్‌శర్మ, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నవీన్‌మిట్టల్‌ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. ఆ భవనం బిల్డర్‌, యజమానులపై కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు.

బాధ్యులపై క్రిమినల్‌ కేసులు: కొత్వాల్‌ ఎ.కే.ఖాన్‌
నారాయణగూడ ప్రాంతంలో భవనం కుప్పకూలిన విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎ.కే.ఖాన్‌ హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమిక్షించారు. పరిస్థితి చేయదాటకుండా వస్తున్న ప్రజలను అడ్డుకుంటూనే శిథిలాల కింద ఉన్న బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

More From State News
SURYA Specials |
Weekly Specials |
Advertisement438
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us